మా ఇంటికి ఎవరూ రావొద్దు: ప్రియాంక పేరెంట్స్‌

హైదరాబాద్‌ : అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె మృగాళ్ల దాష్టీకానికి  ప్రాణాలు కోల్పోవటాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ దుస్సంఘటనను తలచుకుని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. అయితే పరామర్శల పేరుతో పలువురు నేతల పర్యటనతో వారు మరింత మానసిక వేదనకు గురవుతున్నారు. చనిపోయిన తమ కుమార్తెను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, దయచేసి తమను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నేతలు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల నుంచి పలువురు నేతలు ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే.


అయితే ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులు... తమ ఇంట్లోకి ఎవరూ రాకుండా లోపల నుంచి గేటుకు తాళం వేసుకున్నారు.  తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగితే చాలని, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు. తమ వేదనను అర్థం చేసుకోవాలని కోరారు. సరైన సమయంలో పోలీసులు స్పందించి ఉంటే తమ ప్రియాంక దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులు ఇప్పుడు తమ ఇంటి చుట్టూ తిరగడం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.